చెక్ అందజేసిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
హన్మకొండ /జీడబ్ల్యూఎంసీ : హన్మకొండలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయాలకు (ఐడీఓసీ) సంబంధించిన పన్ను బకాయిలుగా రూ. 85 లక్షల 61 వేల 262 మొత్తానికి చెక్ను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సోమవారం హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయంలో జీడబ్ల్యూఎంసీ (బల్దియా) అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నగర పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు తమకు ఉన్న పన్ను బకాయిలను వెంటనే చెల్లించి బల్దియాకు సహకరించాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ముగింపుకు కేవలం ఒక రోజు మాత్రమే గడువు మిగిలి ఉన్న నేపథ్యంలో, మార్చి 31 అర్ధరాత్రి వరకు బల్దియా సేవా కేంద్రాలు నగరవ్యాప్తంగా పనిచేస్తాయని తెలిపారు.
నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆస్తి పన్ను, నీటి పన్నుతో పాటు ఇతర బకాయిలను సమయానికి చెల్లించాలని కోరారు. పన్నుల చెల్లింపులో ప్రజల భాగస్వామ్యం నగర అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఎంహెచ్ఓ డా. రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు (అడ్మిన్) సమ్మయ్య, బిర్రు శ్రీనివాస్, ఆర్ఐ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
